జ్ఞానవాపి మశీదు - కేసు వివరాలు
26.05.2022
జ్ఞానవాపి మసీదు వివాదంపై వారాణసీ జిల్లా కోర్టులో విచారణ ప్రారంభమైంది. మసీదులో దేవతా విగ్రహాలు ఉన్నాయని, అక్కడ పూజలకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతను సవాలు చేస్తూ గురువారం అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. వజూఖానా(నీళ్ల ట్యాంకు)లో శివలింగం ఉందనేది ఆరోపణ మాత్రమేనని, అది ఇంకా నిరూపణ కాలేదని కమిటీ తెలిపింది. శివలింగం కనిపించిందనే వదంతులతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, నిరూపణ అయ్యే వరకూ ఇలాంటి వాటిని అనుమతించకూడదని పేర్కొంది. మసీదు కమిటీ వాదనలు పూర్తి కాకపోవడంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, వజూఖానాలో గుర్తించిన శివలింగాన్ని మసీదు కమిటీ ధ్వంసం చేసిందని హిందూ మహిళల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ ఆరోపించారు. శివలింగంపై ఉన్న 63 సెంటీమీటర్ల రంద్రం వారి పనేనన్నారు. పిటిషన్ విచారణార్హత వ్యవహారం తేలిన తర్వాత ఈ వివరాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. కాగా, మసీదులో ఆలయ ఆనవాళ్లు కనిపించకుండా పెయింటింగ్ వేయించడం తదితర చర్యలకు మసీదు కమిటీ పాల్పడుతోందని హిందూ పక్షం ఫిర్యాదు మేరకు వారాణసీ పోలీసుస్టేషన్లో గురువారం తాజా కేసు నమోదైంది. ( ఆంధ్ర జ్యోతి : తేదీ 26.05.2022)